జాతకం,సత్కర్మయోగం-వేదాంతం శ్రీపతిశర్మ
13 జూన్ 2010 అభిప్రాయములు
జ్యోతిషం పట్ల ఆసక్తి గల మిత్రులు కొందరు సత్కర్మ యోగం గురించి వివరించమని కోరటం జరిగింది.
జాతకం లో దశమ స్థానం కర్మ స్థానం అనబడుతుంది.దీని అధిపతి, రవి పరిస్థితి,గురుబలం, ఏకాదశ బలం, ఆరూఢ లగ్నం బట్టి జీవితం లో చేబట్టు వృత్తిని గురించి జ్యోతిష శాస్త్రవేత్తలు సామాన్యంగా చెబుతూ ఉంటారు. అమ్మవారిని సత్కార్యాచరణానుకూల హృదయాం, సత్పుణ్యచారిత్రకాం… అని వర్ణిస్తాం.ఉదయం నిద్ర లేచి ఇలా ప్రార్థించటం వలన ఏ జాతకులకైనా సత్కర్మ చేయాలనిపించవచ్చు! వేదోక్తం బట్టి వెళితే సూర్యుడు కర్మలను చేయమని ప్రేరేపిస్తాడు. సత్కర్మ, సౌఖ్యం, అసత్కర్మ,అసౌఖ్యం,తిరిగి సత్కర్మ …ఇలా సంకల్పం అనేది సత్కర్మ లేదా అసత్కర్మ వలననే సూక్ష్మంగా మనం గుర్తించవచ్చును.’దుష్కర్మఘర్మమపనీయ చిరాయదూరం నారాయణప్రణయినీ నయనాంబువాహ: ‘ అని కనకధారాస్తవం లో శ్రీ శంకరభగవత్పాదులవారు అమ్మవారిని ప్రార్థిస్తారు. దుష్కర్మఫలం దూరం గా వెళితే తప్ప ఈశ్వరానుగ్రహం లభించదా లేక ఈశ్వరానుగ్రహం వలన దుష్కర్మఫలం దూరమవుతుందా? పిల్ల ముందా, గుడ్డు ముందా? మధ్యలో ఉన్నది ఉపాసన. అది కూడా కర్మయే! అదియే సత్కర్మ. సత్కార్యాచరణానుకూల హృదయం కావాలని కోరుకోవటం కూడా సత్కర్మయే! అదియే ప్రారంభం. ప్రస్తుతానికి ఈ ఉపోద్ఘాతం చాలించి గ్రహాల దగ్గరకు వెళదాం…
శుక్రుడు,గురువు మీనమందు బలవంతులై చంద్రుడు ఉచ్చ రాశి యందున్న ఙ్ఞానార్థములు కలుగుతాయి. కర్మాధిపతి లాభమందు, లాభాధిపతి లగ్నమున, శుక్రుడు దశమమున ఉన్నాసత్కర్మ యోగం ఏర్పడుతుంది. కర్మాధిపతి కేంద్ర త్రికోణములయందుండి ఉచ్చ రాశిలో ఉన్నా, గురునితో కలసినా వీక్షింపబడినా వ్యక్తి సత్కర్మనిరతుడుగా ఉంటాడు. కర్మాధిపతి లగ్నమున లగ్నాధిపతితో ఉండి చంద్రుడు త్రికోణమందున్నా సత్కర్మయోగం అని చెప్పవచ్చును.
మరి అటు వైపు వెళదాం. శని నీచగ్రహముతో కూడి కర్మస్థానమందుండి, కర్మాధిపతి పాపగ్రహయుక్తుడు అయినప్పుడు వ్యక్తి కర్మహీనుడగును. కర్మాధిపతి అష్టమమున ఉండి అష్టమాధిపతి కర్మమందున్నా, పాపగ్రహ యుక్తుడైనా వ్యక్తి దుష్కర్మములయందు ఆసక్తుడవుతాడు.
కర్మాధిపతి నీచరాశియందుండి పాపగ్రహము కర్మస్థానమందుండి, దశమము నుండి దశమమున-అనగా సప్తమమున పాపగ్రహమున్నప్పుడు వ్యక్తి కర్మభ్రష్టుడవగలడు. ఏది చేపట్టినా కలసి రాకపోవటం ఈ విధంగా అర్థమవుతుంది…
ఇక్కడ చెప్పినవి జాతకం, నవాంశ, ఇతర యోగాలు అన్నీ పరిఈలించి చూడాలి. అంటే సమగ్రంగా పరీక్షించాలి. తొందర పడి ఒక నిర్ణయానికి రాకూడదు. బేలసులు, కౌంటర్ బాలెన్సులు చాలా ఉంటాయని మనవి! ఇవి ప్రధానమైన విషయాలు మాత్రమే!
కర్మభ్రష్టులు-ఏది చేసినా కలసి రావటం లేదు అని ఒక వేళ మంచి సిధ్ధాంతి గారు కూడా నిర్ధారిస్తే కిం కర్తవ్యం?
దారి ఉన్నదా? అనే ఆలోచన కలుగవచ్చు. పైన చెప్పినట్లు చెడు రక్తానికి విరుగుడు మంచి రక్తమే! ఒక రకం రక్తం పూర్తిగా తీసేసి కొత్త రక్తం ఎక్కించలేరు. జీవితం సాగుతూనే ఉంటుంది.కర్మలు, కర్మఫలాలు, మరో కర్మరూపమైన కర్మఫలం, ఇలా అన్నీ కలసి అలా పోతూనే ఉంటాయి.సత్కర్మయే మన ఆయుధం.
దాని సంకల్పమే శంఖారావం. పరిష్కారమార్గాల గురించి తిరుగు టపా (పోస్ట్) లో చర్చించగలము!
హరి ఓం తత్ సత్!
~~~***~~~
వ్యక్తులూ,వ్యవస్థలు-వేదాంతం శ్రీపతిశర్మ
13 జూన్ 2010 వ్యాఖ్యానించండి
in వార్తాలాపం
ఇండియన్ ఎక్ష్ ప్రెస్ పది అతి శక్తివంతులయిన భారతీయులను ఇటీవల పేర్కొంది. ఆ జాబితా ఇలా ఉంది (క్రమంలో)
1. రాహుల్ గాంధి -ఈయన గత సంవత్సరం లిస్టు లో లాగానే ఈ స్థానం ఆక్రమించి యున్నాడు.
2. డాక్టర్ మన్ మోహన్ సింగ్ గారు ఒక స్థానం పైకి వచ్చారు
3. సోనియా గాంధి -ఈవిడ ఒక స్థానం కిందకి దిగింది
4. పి. చిదంబరం-ఈయన ఆ లుంగీ తోనే అయిదు స్థానాలు పైకి ఎక్కాడు!
5. ప్రణబ్ ముఖర్జీ-అదే స్థానం లో ఉన్నాడు
6. మోహన్ రావ్ భాగవత్ (ఆర్.ఎస్.ఎస్)-ఈయన కొత్తగా స్థానం సంపాదించుకున్నాడు
7. నితిన్ గడ్ కరి-ఈయన కొత్తగా చేరాడు
8. మమత బెనర్జీ-ఈవిడ ఇరవై స్థానాలు పైకి ఎక్కింది
9. నరేంద్ర మోది-ఒక స్థానం పైకి వచ్చాడు
10.అహ్మద్ పటేల్-ఈయన కూడా ఒక స్థానం పైకి వచ్చాడు
ఈ పేర్లన్నీ చర్చించే ముందు చిత్రంగా తోచిందేమిటంటే చిదంబరం గారు ఎలా తోసుకొస్తున్నారు అని. తెలంగాణా వ్యవహారం లో ఈయన మాట్లాడిన మాటలకి చాల చోట్ల -జాతీయ పేపర్లలో కూడా హాస్యాస్పదమైన వ్యాసాలు వచ్చాయి.రాజ్య సభ లో టెలిఫోన్ టాపింగు వ్యవహారంలో ఒక చర్చ జరిగింది.ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదంటూనే కొన్ని అత్యవసర పరిస్థితులలో అలా అద్దాల సైజులో ఉన్న కళ్లజోడులోంచి తొంగి చూస్తూ చెప్పారు. (ఒక వేళ ఏదయినా బయట పడితే దాని కింద దక్కోవాలని గామోసు).అరుణ్ జెయిట్లీ గారు ఆ అత్యవసర పరిస్థితుల మీద చర్చ ప్రారంభించి సురీం కోర్టు తీర్పు గిరించి ప్రస్తావించారు. ఆ తీర్పు ఆర్థిక ఎమర్జన్సీ గురించి ఉన్నది. అందులో ఆదాయం పన్ను కట్టని వారి వ్యవహారం మీద టెలిఫోన్ టాపింగు చేయవచ్చు అని చెప్పారు. ఇలా విచ్చలవిడిగా కాదు అని తేలిపోయినపుడు ఈయన సరైన సమాధానం చెప్పలేకపోయాడు. కాంగ్రెస్ లో తొందరపాటు సంభాషణ ఎక్కువ. ఒక దొంగ భుజాలు తడుముకున్నట్లే ఉంటుంది. శ్రీ శ్రీ రవిశంకర్ గారి కారు మీద ఎవరో గన్ తో పేల్చారనగానే అది ఆ ఆశ్రమం లోని ఆంతరంగికమైన మనుషుల మధ్య ఘర్షణ అని ఢిల్లీ నుండే వాగేశారు మన గృహ మంత్రి గారు!ఇటీవల ఎవరో రైతు కుక్కలను చంపాలనుకుని గన్నుతో పేల్చాడట అని పోలీసు వర్గాలు తెలుపుతున్నారు.
భోపాల్ వ్యవహారం లో వింత వింత నిజాలు బయటకు వస్తున్నాయి మరి.ఈ లిస్టు రానున్న రోజులలో ఎలా మారుతుందో చూడాలి…
మన రాజకీయాల మీద ఈ వ్యక్తులు చూపే ప్రభావం, వారు ఎందుకు అలా చూపగలుగుతున్నారు, మన వ్యవస్థ ఇలా ఎందుకు సాగిపోతోందీ అనే అంశాలు చర్చించుకో వలసినవే…
వీలు వెంట చర్చలోకి మరల వద్దాం!
~~~***~~~
జవాబు, మరో ఫొటో
13 జూన్ 2010 అభిప్రాయములు
in శ్రీ-సరదాలు!
ఈ అబ్బాయి ఎవరు?
నిన్నటి ఫొటోలో ఉన్నది అమితాభ్ బచ్చనే!
(వేదాంతం శ్రీపతిశర్మ ఎందుకు కాకూడదు? నా చిన్నప్పటి ఫొటో కూడా అలానే ఉంటుంది!)



ఇటీవలి అభిప్రాయములు