‘సర్కసు డేరా’-మధురాంతకం రాజారాం గారి కథ,వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు
13 Feb 2010 1 వ్యాఖ్య
in శ్రీ-విద్య
ఈ కథ 1958లో ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో ప్రచురితమైనది.రాజారాం గారి సాహిత్య అకాడమీ పొందిన(1994) కథల సంకలనంలో మొదటి కథ.
ఊరి చివర ఒక సర్కసు చూడటానికి రచయిత వెళతాడు.అక్కడ గతంలో తన పది రూపాయలు ఎత్తుకుపోయాడనుకున్న నాగులు టికట్టులు తీస్తుండగా చూసి వాడిని ఒక టికట్టు కొనమని చెబుతాడు.అతను అతి కష్టంగా ఒక రేకును పట్టుకుని కొన్ని టికట్టులు తీసుకుని ఎక్కువకు అమ్మటం మొదలు పెడతాడు. ఒక పావళా ఎక్కువ ఇచ్చి కొనుక్కుని సర్కసు చూస్తాడు రచయిత.
సరక్సులో ఆ జంతువుల విన్యాసాలు,బాధలు,కత్తి మీద సాము వంటి ఆ మనుషుల పనులు,ఇటు నాగులు జీవితం,అతని తండ్రి మరణించిన తీరు,చివరకు ఒక సింహం నోటిలో మేక పిల్ల తల దూర్చినా అది చంపకుండా నోరు తెరచి ఉండటం,ఈయన ఆశ్చర్యపోవటం,అదేమిటి ఆ మేక పిల్లకు అంత నమ్మకమా అని అడిగినప్పుడు నాగులు ‘అవి జంతువులు ‘ అని చెప్పటం …ఇవి కథలోని అంశాలు.
కథలో జీవన పోరాటాన్ని ఒక సర్కసు వ్యవహారంతో పోల్చటం జరిగింది.బావిలోకి దిగి మట్టి తీసే వారు,నిచ్చెనలెక్కి పైన ఇటుకలు మోస్తున్న కూలీల జీవితాలు,సర్కసులో విన్యాసాలు,అక్కడ క్రూర జంతువుల మధ్య సాగిపోతున్న సర్కసు కంపనీలోని మనుషులు,ఒక స్త్రీ నిలబడి ఉన్నప్పుడు ఆమెకు తగలకుండా విసురుతున్న కత్తులు…ఇలా హృద్యమైన కథనం పలు చోట్ల హాస్యంతో సాగినా పలు వృత్తులలో జీవన పోరాటం సాగిస్తున్న వారి మీద, మానవులకు ఒక యుధ్ధం లేనిదే జీవితం లేదనే ఆలోచన వలన కరుణ కలుగక మానదు.
గతంలో నాగులు మీద అపనమ్మకంతో ఆ పది రూపాయలూ పోతాయనుకుని వెంట పడినప్పుడు అతను ఎక్కడి నుండో చిల్లర తెచ్చి చేతిలో పెడతాడు. దానికి సిగ్గు పడతాడు రచయిత.ఆ ఘట్టాన్ని చివరికి సర్కసు లో నాగులు తన కాలుకు దెబ్బ తగిలించుకుని టికట్లు సంపాదించి కొంత సంపాదించి ప్రక్కన కూర్చున్నపుడు మరల ప్రస్తావించటం జరుగుతుంది.’అవి జంతువులు కాబట్టి ఆ నమ్మకం ‘ అన్న మాటతో రచయితకు దెబ్బ తగిలినట్లవటంతో కథ ముగుస్తుంది.
కథనం తమాషాగా ఉంటుంది.కథలోని సారాని ఏ పాత్ర ద్వారా చెప్పాలనుకున్నారో ఆ పాత్ర కథలో ముందే ప్రవేశించదు.అంటే ప్రక్రియకు గల నేపథ్యం రచయిత స్వగతంతో ప్రారంభమయ్యి ఒక సహజమైన పాత్ర ఎదురు పడటం జరుగుతుంది కానీ ఆ పాత్ర కథలోకి దూరదు.పఠకుడు అక్కడ అప్పటికే ఉన్న విషయాన్ని ఈ విధంగా గుర్తిస్తాడు. రచయిత గుర్తు చేస్తాడు. కథ అయిపోతుంది!
పోలికను పాఠ్యాంశంగా చెప్పకపోవటం గొప్ప రచయితల లక్షణం.అది వృత్తం తిరిగిన తరువాత బుర్రలో గిర్రున తిరుగుతుంది.మరో సారి తిరిగినప్పుడు మరో ఆలోచన కలుగుతుంది…
~~~***~~~
ఈ కథలోని కొన్ని వాక్యాలు ఆకట్టుకుంటాయి:
‘ చేసిన పాపం చెబితే పోతుందంటారు.ఇలా సర్కసుకు వెళ్లి పట్టణంలో దిగబడిపోయిన అసంఖ్యాక ప్రజాసమూహంలో నేనూ ఓడిని!’
‘ఒక్క వ్యాపారంలోనే ఏమిటి? ఈ వ్యాపారాలూ,విద్యలూ,భోగాలూ,భాగ్యాలూ,నాటకాలూ, బూటకాలూ,దేనికైతే అవసరమవుతున్నాయో ఆ బ్రతుకే రెండు విధాలుగా ప్రస్తరిల్లిపోతున్నది.ఒకటి, ప్రవాహ గతిని అనుసరించి, అశ్రమంగా, అదొక వినోదంలా పడవ నడపటం,రెండు, చేతుల బలంతో అంతకంతకూ తరిగిపోతున్న శరీర దారుఢ్యంతో ఏటికెదురీదటం!’
‘ఆలోచనకు తెరపి ఇవ్వకుండా అనుభూతే మానసాకశమంతా క్రమ్ముకున్నప్పుడు నియమాలు నిలవవు.ఆ స్థితిలో ఎవరికైనా మైమరుపు కలుగుతుంది.’
‘తీసుకో, తీసుకో ‘ అని కుర్రవాడిని వూరించి, వాడు దగ్గరకి వచ్చే లోపుగానే మనం దాచి పెట్టుకునే తినుబండారంలా అంతలో మృత్యుదేవత చిక్కి బిక్కరించబోయి, ఇంతలో దూరంగా వెళ్లి వెక్కిరించటమేనా మానవ జీవితం?’
ఎంత నిజం?!
~~~***~~~

Feb 13, 2010 @ 10:54:49
http://dedicatedtocpbrown.wordpress.com/2010/02/06/%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3/