‘ దో బీఘా జమీన్ ‘ చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు
22 ఆగ 2009 అభిప్రాయములు
in శ్రీ-చిత్రం

నియో రియలిసం అనే ఒక ప్రక్రియ చలన చిత్రాలల విషయంలో వింటూ ఉంటాం. దీని గురించి అంతర్జాతీయంగా చర్చించినప్పుడు ఎక్కువగా ఇటలీ గురించి కూడా వింటూ ఉంటాం. మన దేశం గురించి మాట్లాడినప్పుడు బిమల్ రాయి 1953 లో తీసిన ‘ దో బీఘా జమీన్ ‘ గురించి చెప్పకుండా ఉండలేము. ఈ చిత్రానికి ఎన్నో కీర్తి కిరీటాలున్నాయి. వాటి గురించి తరువాత చెప్పుకోవచ్చు. తెర తీద్దాం…
~~~***~~~
భూమిని తాకట్టు పెట్టిన చిన్న రైతు శంభు (బల్రాజ్ సాహ్ని ). జమీందారు దగ్గరకు వచ్చి ఒక పారిశ్రామిక వేత్త ఆ భూమిని ఎంచుకుని ఫాక్టరీ కడతానని చెబుతాడు. ఆ భూమిని ఇపించేందుకు శంభూని కోర్టుకి ఈడ్చి మూడు నెలలలో డబ్బు కట్టకపోతే భూమి వేలం అవుతుందని తేలుస్తాడు జమీందారు. డబ్బు సంపాదించేందుకు కోల్కటాలో శంభు, తన పిల్లవాడితో పడు కష్టాలు చిత్రం యావత్తూ కమ్ముకుంటాయి.
చివరకు శంభు ఆ భూమిని వదులుకోవాల్సి వస్తుంది. ఇదేమి సినిమా? నిజమే!
జాగ్రత్తగా ఆలోచిస్తే దర్శకుడు చూపించదలచుకుంది చాలా గొప్ప విషయం. భూమిని వదలను అని ఒక రైతు చెప్పి దేనికైనా సిధ్ధ పడటం. రెండు-అతని కుటుంబం ఇందులో అతని వెంటే నిలబడటం. మూడు, ఉన్న వాళ్ల ప్రపంచం ఎంత పీడించినా లేని వారి జగత్తు అతన్ని కలుపుకుని అడుగడుగునా సహాయం చేయటం. ఈ లేనివారి ప్రపంచం చూపించినప్పుడు అందులోని క్రౌర్యం కూడా బాధాకరంగా ముందుకొస్తుంది. కానీ అందులోనే మానవతా విలువలు కనిపిస్తూ ఉంటాయి. చివరకు ఒక కుటుంబం భూమిని వదులుకున్నా కుటుంబం గానే ప్రక్కగా వెళ్లిపోతుంది.
శంభు తండ్రి ‘ భూమి పోతే ఏమయింది? ఈ ప్రపంచం అంతా మన భూమే, ఆకాశమంతా మన ఇంటి పైకప్పే ‘ అని చాటుతాడు. కుటుంబం లోని బంధాలు అంత గొప్పవి. అది తెలిసిన వారికే ‘ వసుధైవ కుటుంబకం ‘ అనేది అర్థమవుతుంది.
~~~***~~~
చిత్రం వెనుక చిత్రీకరణలోని ఒక మర్మం దాగి ఉంది. ప్రారంభంలో ఒక కరవు పరిస్థితి, వెంటనే ఒక వాన జల్లు, జనంలో ఉత్సాహం, ఆ తరువాత శంభు సమస్య…ఇది సరళి. భూమి నాకేమిచ్చింది అని రైతు అడగడు. భూమి తల్లి. మనలను కని మోసే తల్లి. మనం భూమికి ఏమిచ్చామనేది అందరం వేసుకోవలసిన ప్రశ్న. అన్ని పోరాటాలూ భూమి కోసమే, రాజ్యం కోసమే! ఇందులో పోరాడిన ప్రతివాడూ గెలుస్తాడు. పోరాటమే గెలుపు!
కొన్ని దృశ్యాలు కదిలిస్తాయి. బల్రాజ్ సాహ్నీ తోపుడు బండీని గుర్రం బండీతో సమానంగా వేగం చేయమని ఆసామి పోరటంతో పరుగులు తీసి పడిపోతాడు. విషయానికి అద్దం పట్టే ఘటనతో కథనాన్ని ముందుకు తోసుకుపోయినప్పుడు చరిత్ర లేచి నిలబడుతుంది, దటీస్ ప్రెసెంటేషన్!
డబ్బులు లేనప్పుడు తండ్రి కడుపులో బాలేదు అని తినాం మానెస్తాడు. చిన్న పిల్లవాడు కూడా బయటకు తినటానికి వెళ్లినట్లే వెళ్లి నాకూ కడుపులో బాలేదని ఊరుకుంటాడు…
శంభు భార్య (నిరుపా రాయి ) భర్తకు ఉత్తరం వ్రాయిస్తున్న దృశ్యం ఎంతో సున్నితంగా చిత్రీకరించాడు దర్శకుడు.
ఈటలీ చిత్రం ‘ ద బైసకల్ థీఫ్ ‘ లోని తండ్రీ కొడుకుల ఉదంతం బట్టి ప్రభావితమయినట్లు బిమల్ రాయి చెప్పి యున్నాడు.
ప్రస్తుతం మన దేశం తన జి. డి. పీలో వ్యవసాయ రంగం ప్రాముఖ్యత తగ్గించుకుంటూ పోయి ఇతర రంగాలలోకి దూకేసింది.ఒక సారి ఈ చిత్రం చూసి ఆలొచించవలసిన అవసరం ఉందనిపించింది. ఆర్థిక విధానాల సంగతి ప్రక్కన పెడితే కనీసం భూమి పట్ల మనం చేస్తున్న అమానుషం, కాలుష్యం, దిగజారిన కుటుంబ వ్యవస్థలు, మరుగున పడ్డ విలువలు…ఇవన్నీ కరవులో భాగాలు అని బాధ పడవలసి వస్తుంది…
~~~***~~~
‘ దో బీఘా జమీన్ ‘ ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను ప్రవేశపెట్టినప్పుడు మొట్ట మొదటి ఉత్తమ చిత్రంగా ఎన్నికైన చిత్రం. అలాగే కాన్ అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ఉత్తమ చిత్రంగా ఎన్నికైన తొలి భారతీయ చలన చిత్రం.మరో చరిత్ర ఈ చిత్రానికి ఉంది. ఈ చిత్రాన్ని తను తీయలేకపోయినందుకు రాజ్ కపూర్ బాధ పడ్డాడుట!
ఈ చిత్రానికి సంగీతం అందించిన వారు సలిల్ చౌధరీ. పాల్ మహేంద్ర సంవాదాలు వ్రాశారు. హృశీకేష్ ముఖర్జీ దృశ్యాలను వ్రాసి కూర్పు చేశారు. కమల్ బోస్ అద్భుతమైన ఛాయాగ్రహణం చేశారు.
అందరూ మహానుభావులే! వీరు కలసినప్పుడు ఈ చిత్రం లోని ఒక పాట తిరిగి చెప్పుకోవాల్సి ఉంటుంది-’ ధర్తీ కహే పుకార్ కే, అప్ని కహానీ ఛోడ్ జా, అప్ని నిశానీ ఛోడ్ జా…’
ప్రతి కష్టానికీ ఒక కథ, ఒక గుర్తింపు అలా మిగిలిపోతుంది.
మన భూమి, మన ప్రజల లోతులలోకి ఒక్క సారి వెళ్లండి అని మన కళా జగత్తు మన దర్శకుల వైపు తిరిగి ఈ రోజు కేక పెడుతోంది…ధర్తీ కహే పుకార్ కే!
~~~***~~~
‘ నిన్న లేని అందమేదో’ (24)-వేదాంతం శ్రీపతి శర్మ
22 ఆగ 2009 1 వ్యాఖ్య
in శ్రీ-రచనలు

లోయ దగ్గరకి వెళ్లేసరికి శరత్ బాగా అలసిపోయాడు. విశ్రాంతి కోసం గదులు వెతికి చివరికి ఒక గెస్ట్ హవుస్ మేడ మీద ఒక గది సంపాదించి భోజనం చేసి సాయంత్రం చీకటి పడే వేలకి పిట్ట గోడ మీద కాలు పెట్టి అలవాటైన ఆకాశం లోకి చూస్తూ కూర్చున్నాడు. ఆ గెస్ట్ హవుస్ ఎవరో చక్కని ప్రదేశంలోనే కట్టారు. దూరంగా ఒక నది పాయ అలా ప్రవహిస్తోంది. చంద్రుని కాంతి అందులో చిత్రంగా ప్రతిబింబిస్తున్నది. వాన బాగా కురిసి వెలిసింది. ‘సార్…’, ఎవరో వెనుకనుండి అంటున్నారు.
‘ ఏమి కావాలి? ‘
‘ ఏమి లేదు సార్…’
అటు తిరగలేదు శరత్. ‘ నాకిప్పుడు తినేందుకేమీ అక్కరలేదు. రాత్రి చూద్దాం…’
‘ అది కాదు సార్…’
విసుగ్గా అటు తిరిగాడు. అక్కడ ఉన్నది ‘ ఆదుర్దా ‘. సంచీ తగిలించుకుని ఉన్నాడు. ఇద్దరూ ఒకే సారి అన్నారు, ‘అరే! ‘
‘ సార్, మీరు ఇంటికి వెళ్లిపోయారనుకున్నాను. ఇక్కడే ఉన్నారా?’
‘ లేదు ఆదుర్దా గారూ, అలసిపోయానని ఉండిపోయాను. మీరేంటి?’
అతను పిట్ట గోడ మీద చిన్నగా ఆనుకున్నాడు.
‘ నేను వానలో తడిసిపోయాను సార్. నేనూ వెళ్లలేకపోయాను. ఇక్కడ కొద్దిగా ఈ రాత్రికి తల దాచుకుందామని కింద అడిగాను. పొమ్మన్నారు. ఆ వాచ్మన్ ఎవరో ఇలా పైన ఒక సారు దిగారు, అడిగి చూడమంటే ఇక్కడికి వచ్చాను. నేను గదిలోకి రాను లెండి. ఇలా ఈ డాబా మీద పడుకుంటాను. ‘
శరత్ సిగరెట్ తీశాడు. ముట్టించి అతనికీ ఒకటి అందించాడు.
‘ ఆదుర్దా గారూ, నన్ను అవమానించకండి. ప్రకృతి ఒడిలోకి కవల పిల్లల్లాగా ఊడి పడ్డాం. కాకపోతే మరల ఇలా ఎందుకు కలుసుకుంటాం? పైగా నాకూ తోచదు. మీరూ నాతోనే ఉండండి. ‘
ఆదుర్దా శరత్ ను చూసి చిరునవ్వు నవ్వాడు.
‘ కూర్చోండి. ఏదైనా చెప్పండి. అలా చూడండి. ఏమీ అనిపించటం లేదా?’
ఆదుర్దా అక్కడున్న మరో కుర్చీలో కూర్చున్నాడు.
‘ ఏమిటో శరత్ గారూ, నా ముందు ఎవరైనా ఒక చక్కని విషయం మీద తప్పుగా వ్యాఖ్యానం చేస్తే తీవ్రంగా ఖండించి పోట్లాడేవాడిని. అదేంటో ఆ రోజులు వెళ్లిపోయాయి. ఒకప్పుడు ఆశువుగా ఎన్నో చెప్పే వాడిని. నేను ఓ గొప్ప రచయితని అనే గట్టిగా నమ్మేవాడిని…’
‘ అదేంటి? నమ్మటం ఎందుకు? కారా?’
‘ కాను. ఎవడైనా ముందు మనిషి. తరువాత రచయితో లేక కవో లేక పండితుడో…’
‘ మీరు ఎందుకో బాధలో ఉన్నట్లున్నారు ‘
‘ ఈ శరీరం ఉంది చూశారూ, ఇది మహా మోసం. దీని పోషణకే ముప్పావు జీవితం గడిచిపోతుంది. సమాజాన్ని నేను ప్రశ్నించాలన్నా ఈ సమాజం నాకు తిండి పెట్టాలి! ‘
‘ కరెక్ట్!’
‘ కంటిలో నలుసు పడ్డప్పుడు ఎదురుగా ఏడుకొండలవాదు వచ్చి నిలబడ్డా ఏమీ చేయలేము. ఆ నలుసును ఊదేసి అదుగో కళ్లు తెరు అనే వాడే దేవుడు! ‘
‘ నలుసు? ‘
‘ నలుసా…అదీ అది ఏమిటి?’
‘ అది సృష్టిలోని భాగం కాదా?’
‘ నిజమే. ఇది చిత్రంగా ఉంది. ఆలొచించాలి. ‘
‘ మీ నలుసు ఇంతకీ ఏమిటి? ‘
‘ వదిలేయండి. తరువాత మాట్లాడుకుందాం. ఆ నీటిలో చక్కని ప్రతిబింబం కనిపిస్తోంది. అయితే మీరన్నట్లు మబ్బు ఒకటి అడ్డు వస్తే ఆ కాంతి మరింత విరజిమ్మి మరో దృశ్యం కనిపిస్తోంది…’
‘ ఇందులో నేనేమన్నాను?’
‘ నలుసు. ఏదో అడ్డం రావాలి. నిజమే. అదే జీవితం! ‘
‘ అబ్బో! క్షణంలో ఎక్కడికో వెళ్లిపోయారు. ‘
అతను అలా ఎందుకో చూస్తూ ఉండిపోయాడు.
‘ చెప్పండి ‘
‘ ఆకాశానికి ఈ నది ఎంత చక్కగా అద్దం పడుతోంది? ‘
‘ అంత ఆకాశానికా?’
‘ కాదు. నేను నది గురించి చెప్పటం లేదు. మన మనస్సుల గురించి అంటున్నాను. ఈ చిన్న చోటులో ఎన్ని భావాలు?’
శరత్ ఆలోచించాడు. ఆలోచన బాగుంది.
‘ ఇంటిలో అద్దం ముందు చాలా సేపు నిలబడతారన్న మాట!’
అతను నవ్వాడు. ఎందుకో నవ్వుతూ నవ్వుతూ ఆగిపోయాడు. సిగరెట్ పడేశాడు.
‘ అద్దం ముందు నిలబడి కూడా అందమైన ఆలోచనని తప్ప మరొకటి చూడలేనివాడు కవి…’, మెల్లగా అన్నాడు, ‘…అద్దం ముందు నిలబడి కూడా అందమైన ఆలోచనను తప్ప మరొకటి చూడలేని వాడు కవి. అద్దం ముందు నిలబడే వయసు లేదు, అబధ్ధాన్ని నిలదీసే మనసూ లేదు. ఆలోచనలు పెరగటం వలన వయసు వచ్చేస్తుందో లేక వయసు మీద ఆలోచనలు మీద పడతాయో తెలియదు…నాకూ వయసు వచ్చేసింది శరత్ గారూ! ‘
దూరంగా ఎవరో నిప్పు వెలిగించినట్లున్నారు. అలా పొగ ఆ గుబుర్లలోంచి పైకి వస్తోంది. గాలి చల్లగా వీస్తోంది…
~~~***~~~
( తరువాయి భాగం త్వరలోనే )
ఇటీవలి అభిప్రాయములు