పురాణ కాలక్షేపం(6)-వేదాంతం శ్రీపతి శర్మ
10 జూన్ 2009 వ్యాఖ్యానించండి

హరి: ఓం!
చాలా మంది గుడిలోని దేవుడిని చిత్రమైన కోరికలు కోరుతూ ఉంటారు.కోడలు అత్తగారిని పంపించమని, అత్తగారు ఇక్కడే ఉండి నా పెత్తనాలు భరించేటట్లు చేయమని, దొంగవాడు మంచి చోటు దొరకాలని…ఇలా అన్నీ కోరికలే. మరి దేవుడు ఎవరి కోరికని తీర్చాలి?
ఇవన్నీ ప్రక్కన పెట్టండి. ఒకరు ఇలా ఆలోచించారు-పరమాత్మ ఏడు కొండల మీద నిలబడి ఉంటే ఇంకా జనులకు సమస్యలు, లోకంలో అరాచకాలు ఇవన్నీ ఎందుకు జరగాలి? ఆయన కరుణ అంతటా వ్యాపించి యున్నది కదా?
నిజమే!
ఆలోచిస్తే అలాగే ఉంటుంది. సృష్టిలోని సమస్యలు, సమాధానాలు, దైవానుగ్రహం ఇలాంటివి ధర్మం,స్వధర్మం , సత్కార్యాచరణ, సదాచారం, స్వాధ్యాయం, ఉపాసన, తపస్సు, నిర్మలమైన హృదయం మీద ఆధారపడి యున్నాయి.
సామాన్యంగా నేను కొండకు వచ్చాను అని అనుకోవటం పొరపాటు. భగవంతుడు దూరాలు, కాల పరిమితులకు అతీతుడు. ఆయన మనలను తలచుకున్నప్పుడు మనం ఒక క్షేత్రానికి వెళ్లాము అనుకునే బదులు ఆయన మన దగ్గరకు వచ్చాడు అనుకోవాలి. ఇది ధర్మాచరణ మీద ఆధారపడియున్నది.
‘ ధరతి, ధారయతి ఇతి వా ధర్మ: ‘-లోకమును వ్యవస్థతో కాపాడునది, వ్యక్తులను, జాతిని రక్షించునది ధర్మము.
జైమిని మహర్షి ‘ చోదనాలక్షణోర్థో ధర్మ: ‘ అని చెప్పి యున్నాడు. వేదములయందు, స్మృతులయందు, ఈ పనులు చేయవలసింది అని చెప్పినవి ధర్మములు. ఆ రీతిగా ఆచరించినప్పుడు పశు, పుత్ర, ఐశ్వర్యాదులు, ఇహలోక సుఖము, పరలోక సుఖము, తత్వ జిఙ్ఞాస, ఆత్మ సాక్షాత్కారము కలుగుతాయి.
కొన్ని ధర్మములు సామాన్య ధర్మములు-అహింసా సత్యమస్తేయం శౌచమింద్రియనిగ్రహ:
రామాయణం సత్యము, ధర్మము గురించి చెబుతుంది. ‘ సత్యధర్మానురక్తానాం నాస్తి మృత్యుకృతం భయం ‘-(యుధ్ధకాండ)
అరణ్య కాండలో -
శ్లో: ధర్మాదర్థ: ప్రభవతి ధర్మాత్ ప్రభవతే సుఖం
ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్
అని మహర్షి చెప్పి యున్నాడు.
(ధర్మం గురించి మరి కొన్ని విషయాలు తరువాయి భాగంలో)
సర్వే జనా: సుఖినో భవంతు!
ఓం శాంతి: శాంతి: శాంతి:
~~~***~~~
ఇటీవలి అభిప్రాయములు